బెట్టింగ్ జోరు.. యువత బేజారు!
- మేడ్చల్ మండలంలో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్స్
- విచ్చలవిడిగా బెట్టింగ్ యాప్స్
- ఈజీ మనీ కోసం యువకుల ఆరాటం
జయభేరి, మేడ్చల్ : కోట్లాదిమంది ప్రేక్షకులు అదరణతో సాగుతున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్ తుదిదశకు చేరింది. ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే క్రికెట్ అభిమానుల సంగతి పక్కన పడితే బెట్టింగ్ రాయుళ్లు, బెట్టింగ్ మాఫియా చెలరేగిపోతుంటారు. మ్యాచ్ మ్యాచ్ కు కాకుండా బాల్ బాల్ కు పందెం కట్టి రూ.వేల నుంచి రూ.లక్షల వ్యాపారం చేస్తున్నారు. పందెం నడిపేవారు, పందెం కాసేవారు ఎవరూ ఒకరినొకరు చూసుకున్న పరిస్థితి ఉండదు. ఈ వ్యవహారమంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఈ బెట్టింగ్ కు యువత ఆకర్షితులై ఒకటి రెండు మ్యాచ్లతో మొదలు పెట్టి అప్పులపాలై ఆర్ధికంగా చితికిపోవడమే కాకుండా ఆత్మహత్యలు పాల్పడుతున్నారు.
ఈ క్రికెట్ బెట్టింగ్ మేడ్చల్ మండలంలో ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. మేడ్చల్ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగులు జోరుగా నడుస్తున్నాయి. ముఖ్యంగా మేడ్చల్ పట్టణంలోని ప్రధాన నిలయాలైన ప్రధాన చౌరస్తాలు, టీ కొట్లు, పాన్ షాపులు, పైనాన్స్ షాపులు, ప్లాట్ల లే అవుట్లలో ప్రస్తుతం ఐపీఎల్ బెట్టింగ్ కు అడ్డాగా మారాయి. మ్యాచ్, బంతి గాల్లోకి లేచిన సమయం, బ్యాట్మెన్ చేసే పరుగులు, ఎవరు గెలుస్తారనే దానిపై సెకన్ల వ్యవధిలో పందెం కాస్తున్నారు. గెలుపొందిన వారి బ్యాంకు ఖాతాల్లో గూగుల్ పే, ఫోన్ పేల ద్వారా డబ్బు జమ చేస్తున్నారు. రూ.వెయ్యి నుంచి రూ.10 వేలతో పాటు రూ. లక్ష వరకు క్రికెట్ బెట్టింగ్లు నడుస్తున్నాయి.
యువతే టార్గెట్...
క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే నిర్వాహకులు ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తున్నారు. ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఇలా ఉన్నత విద్య అభ్యసిస్తున్న చాలా మంది ఫోన్ నంబర్లకు కాల్ చేసి బెట్టింగ్ వేస్తావా అని అడగడం విశేషం. ఇదే అదునుగా ఈజీ మనీ ఎలా సంపాదించాలో మెసేజ్ల ద్వారా మోటివేట్ చేస్తూ మెల్లిగా వారి నుంచి బ్యాంకు అకౌంట్లు, పాన్ కార్డు, ఆధార్ తదితర వివరాలను తీసుకుంటున్నారు. రూ. వెయ్యి రూ.రెండు వేలతో మొదలైన బెట్టింగ్ ఒకటికి రెండు రెట్లు డబ్బులు రావడంతో ఇంకా ఎక్కువ వస్తాయనే ఆశతో చాలా మంది అధిక మొత్తంలో బెట్టింగ్ లో డబ్బులు పెట్టి అప్పుల పాలవుతున్నారు. ఇప్పటి వరకు చాలా మంది నష్టపోయిన వారే ఉన్నారు. రూ.5 రూ.10 వడ్డీ లెక్కన అప్పులు చేసేందుకు సైతం వెనకాడడం లేదు.
బెట్టింగ్ జరిగేదిలా....
20-20 ఐపీఎల్ మ్యాచ్లో మొదటి ఐదు.. చివరి మూడు ఓవర్లు చాలా కీలకం. మొదటి ఐదు ఓవర్లకు రూ. వేలల్లో బెట్టింగ్ జరిగితే.. 10వ ఓవర్ పూర్తయేసరికి మరి కొంత పెరుగుతుంది. మ్యాచ్ ఉత్కంఠను బట్టి..15, 16, 17 ఓవర్లలో బ్యాట్మెన్, బౌలర్, ఓవర్ లాగా మ్యాచ్ కు రూ.వేలు, రూ.లక్షల్లో పందెం కాస్తుంటారు. ఎక్కువగా 18, 19 ఓవర్ల సమయంలో మూడు బంతులపై బెట్టింగ్ చేస్తారు. చివరి ఓవర్ సమయంలో ప్రతి బాలు ఫోర్, సిక్స్ తో పాటు విజేత ఎవరనే దానిపై డబ్బు కుమ్మరిస్తూ ఉంటారు. ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారం గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకుతోంది. లక్షల్లో కాకుండా వందల సంఖ్యలో బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. యువకులు రూ.వెయ్యి నుండి మొదలు పెడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. వారి ఆర్థిక పరిస్థితులను బట్టి బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్లు యువకుల్లో ఎక్కువమంది చూస్తుంటారు. ఎక్కువ మంది ఒకేచోట చేరి మ్యాచ్లు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ సమయంలో చిన్న చిన్న బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. పట్టణానికే పరిమితమైనదనుకున్న బెట్టింగ్ జబ్బు కాస్త గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది.
కట్టడి చేయకుంటే కష్టమే...
ఐపీఎల్ బెట్టింగ్ కాస్త వ్యసనంగా మారింది. దీనిని కట్టడి చేయకుంటే మాత్రం భవిష్యత్తులో కష్టమే. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఐపీఎల్ మ్యాచ్లు కొనసాగుతున్నాయి. ఈ మ్యాచ్ల కోసం బెట్టింగ్ రాయుళ్లు ఎదురు చూస్తుంటారు. బెట్టింగ్లకు పాల్పడుతూ దండిగా సంపాదించుకునే వాళ్లు తక్కువ మందే. బెట్టింగ్లతో ఆర్థికంగా నష్టపోతున్న వాళ్లు ఎక్కువ మంది ఉంటున్నారు. బెట్టింగ్ మరింతగా ముదిరిపోక ముందే దీనిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బెట్టింగ్లకు యువత చిత్తు కాకముందే దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Post Comment