సీఆర్టీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
గిరిజన పిల్లలను చదువుకు దూరం చేసే కుట్ర ప్రభుత్వం మానుకోవాలి
తెలంగాణ జాగృతి ముస్లిం మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి ముస్తఫా
జయభేరి, హైదరాబాద్ : తెలంగాణ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న 2104 మంది రెసిడెన్షియల్ ఉపాధ్యాయులకు (సీఆర్టీలు) 5 నెలల నుంచి పెండింగులో ఉన్న జీతాలను వెంటనే విడుదల చెయ్యాలి. నెలల కొద్దీ జీతాలివ్వకుంటే కుటుంబాలు ఎలా గడుస్తాయో ప్రభుత్వం అర్థం చేసుకోవాలి.
ఒక్క రెగ్యులరైజేషన్ తప్ప మెదిలిన హామీలన్నీ నెరవేరుస్తామని మంత్రి సీతక్క స్పష్టమైన హామీ ఇచ్చారు. రెండుసార్లు రివ్యూ జరిపినా కానీ ఇప్పటివరకు సీఆర్టీలకు ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ఇది కూడా కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలాగే మిగిలిపోయింది. హామీలిచ్చి మూడు నెలలైనా అమలు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గిరిజన విద్యార్థులకు చదువుచెప్పే ఉపాధ్యాయులను జీతాలివ్వకుండా రెగ్యులర్ చెయ్యకుండా వేధిస్తే చివరికి నష్టపోయేది గిరిజన బిడ్డలే అని ప్రభుత్వం గుర్తించాలి. గిరిజన పాఠశాలల్లో బోధన నిలిచిపోతే ప్రైవేటులో చదువుకోవాలంటే ఆర్థికంగా చాలా నష్టపోతారు.
తమ సమస్యలు పరిష్కరించకుంటే సెప్టెంబరు 15 నుండి మళ్లీ సమ్మెకు దిగబోతున్నరు. దానివల్ల గిరిజన బిడ్డలకు మరోసారి నష్టం జరుగుతుంది. తక్షణమే తెలంగాణ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న 2104 మంది రెసిడెన్షియల్ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి పేద గిరిజన విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా చూడాలని తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తున్నది. లేని పక్షంలో సీఆర్టీల ఆందోళనకు జాగృతి మద్దతుగా ఉద్యమిస్తాం...


