ఫెయిల్ అయిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
- సప్లమెంటరీ లో 100% ఉత్తీర్ణత సాధించాలి
- గత పది యేండ్లుగా ఫెయిల్ అయిన విద్యార్థులు డాటా సేకరించాలి
- అందరూ పరీక్ష రాసేలా చూడాలి
జయభేరి, కరీంనగర్ :
పదవ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి సారించి సప్లమెంటరీలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మండల విద్యాధికారులను ఆదేశించారు. పదవ తరగతి ఫలితాలు, విద్యాశాఖలో భవిష్యత్తు కార్యాచరణ పై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మండల విద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. ప్రభుత్వ పాఠశాలలో చదివిన 6,200 మంది విద్యార్థుల్లో 5995 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతాన్ని పెంచాలని సూచించారు. ఈ ఏడాది పదవ తరగతిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 96.69 శాతం మంది ఉత్తీర్ణత సాధించిన విషయాన్ని వారికి తెలియజేయాలని అన్నారు. మండల విద్యాధికారులు అన్ని పాఠశాలలను సందర్శించి అక్కడ కావలసిన సౌకర్యాల నివేదికను సమర్పించాలని అన్నాను. విద్యార్థులు తక్కువ, ఎక్కువ ఉన్న పాఠశాలలను గుర్తించి ఫర్నిచర్ సర్దుబాటు చేయాలని సూచించారు. ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీలు భవిత కేంద్రాలను తక్కువ విద్యార్థులు ఉండి గదులు ఖాళీగా ఉన్న పాఠశాలలోకి మార్చాలని ఆదేశించారు. వీలైనన్ని అంగన్వాడీలను ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయాలని సూచించారు. భవిత కేంద్రాల ఆధునీకీకరణ పనులను, సమ్మర్ క్యాంపులను పర్యవేక్షించాలని ఎంఈఓ లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయి, జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, కోఆర్డినేటర్లు మిల్కూరి శ్రీనివాస్ ఆంజనేయులు, డిసిడిఓ కృపారాణి, సిడిపిఓలు సబితా శ్రీమతి పాల్గొన్నారు.
Post Comment