జర్నలిస్టుల ముసుగులో వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకోవాలి
ఏసీపీ ని కోరిన కూకట్ పల్లి ప్రెస్ క్లబ్
బోర్ల వద్దకు, సామాన్యులను ఇబ్బందులకు గురిచేయొద్దు
డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదులు చేయండి
జయభేరి, హైదరాబాద్ : గౌరవప్రదమైన జర్నలిజం వృత్తిని అప్రతిష్టపాలు చేస్తున్నటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి ప్రెస్ క్లబ్ విజ్ఞప్తి చేసింది.
సామాన్యులకు అండగా నిలవాల్సిన జర్నలిస్టులే వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు వెలుగు చూస్తుండడం విచారకరమన్నారు. సమాజంలో ఈ పోకడలతో జర్నలిస్టులు అంటే సామాన్యులకు చులకన భావం ఏర్పడుతుందని ఆవేదన చెందారు. జర్నలిస్టుల విలువలను కాపాడాల్సిన అవసరం ఉందని ఏసిపిని కోరారు. జర్నలిజం ముసుగులో అక్రమ మార్గంలో వసూళ్లకు పాల్పడుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు.
బోర్ల దగ్గరికి, సామాన్యులు ఇల్లు కట్టుకుంటే వారి దగ్గరికి వెళ్లి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. జర్నలిస్టుల పేరుతో సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏసీపికి జర్నలిస్టులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో ఉన్న జర్నలిస్టులకు ప్రస్తుతం ఉన్నటువంటి వారికి చాలా వ్యత్యాసం కనిపిస్తుందన్నారు.
జర్నలిస్టుల పట్ల సామాన్యులకు చులకన భావం ఏర్పడిందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. బాధితుల వద్ద నుంచి ఫిర్యాదులు అందితే కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జర్నలిస్టు సంఘాల నాయకులు గడ్డమీది బాలరాజు, ఆర్కే దయాసాగర్, నిమ్మల శ్రీనివాస్, ఎం ఏ కరీం,నవీన్ రెడ్డి, ఏబీఎన్ వేణు, నాగరాజు, క్రాంతి, గంగరాజు, సదా మహేష్, మాణిక్య రెడ్డి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Post Comment