Ap : కేబినెట్ లెక్కల్లో బొత్సా, గంట
గంటా శ్రీనివాసరావు జూన్ 9న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని జోష్యం చెప్పారు. బొత్స సత్యనారాయణ ఇంకో అడుగు ముందుకేసి… విశాఖ నగరంలో జూన్ 9న జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని తేల్చి చెప్పారు. మాజీ మంత్రి హోదాలో గంటా శ్రీనివాసరావుకు ఆహ్వానం పంపుతామని.. తప్పకుండా హాజరుకావాలని కౌంటర్ ఇచ్చారు.
జయభేరి, విశాఖపట్టణం, మే 20 :
ఏపీలో ఇద్దరు నేతల పరిస్థితి ఆలూ లేదు.. చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉంది. ఒకవైపు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. జూన్ 4న ఫలితాలు ప్రకటించనున్నారు. అందరూ రిలాక్స్ గా ఉండగా.. ఆ ఇద్దరు నేతలు మాత్రం రాజకీయ వేడి పెంచుతున్నారు. ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారు. గెలుపు పై ధీమాతో పాటు ఏకంగా తమ నేతలు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చెప్పుకొస్తున్నారు. దీంతో ఒక రకమైన గందరగోళానికి కారణం అవుతున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లు.ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. ఓటర్ తీర్పు ఈవీఎంలలో ఉంది. జూన్ 4న వెల్లడి కానుంది. ఇంతలో నేతల ప్రకటనలు చూస్తుంటే అతిగా ఉన్నాయి.
భీమిలి అసెంబ్లీ సీట్లు నుంచి చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న గంటా శ్రీనివాసరావు టిడిపి అభ్యర్థిగా బరిలో దిగారు.వాస్తవానికి చీపురుపల్లిలో బొత్స పై గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ గంటా కోరిక మేరకు భీమిలి స్థానాన్ని ఖరారు చేశారు చంద్రబాబు. అయితే పోలింగ్ తర్వాత ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం గమనార్హం. ఇద్దరు ఒకేసారి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మధ్యలో బొత్స కు పరాజయాలు పలకరించాయి. కానీ గంటా శ్రీనివాసరావు మాత్రం వరుస విజయాలతో ముందుకు సాగుతున్నారు.అయితే ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఈ ఇద్దరు మిత్రులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
గంటా శ్రీనివాసరావు జూన్ 9న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని జోష్యం చెప్పారు. బొత్స సత్యనారాయణ ఇంకో అడుగు ముందుకేసి… విశాఖ నగరంలో జూన్ 9న జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని తేల్చి చెప్పారు. మాజీ మంత్రి హోదాలో గంటా శ్రీనివాసరావుకు ఆహ్వానం పంపుతామని.. తప్పకుండా హాజరుకావాలని కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ఏ ఇతర సీనియర్ నేతలు ఫలితాలపై పెద్దగా మాట్లాడటం లేదు. ఈ ఇద్దరు నేతలు మాత్రమే ఏకంగా ప్రమాణస్వీకారాలపై వ్యాఖ్యానించడం విశేషం.
Post Comment