మేడ్చల్ జిల్లాలో సమస్యలకు కేరాఫ్ గా పాఠశాలలు
బాబాగూడ లోని శాంతినికేతన్ పాఠశాల వార్డెన్ వేధింపులు తాళలేక ఇద్దరు విద్యార్ధుల పరారీ
ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు... బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
జయభేరి, జులై 1:
ఇక మేడ్చల్ జిల్లాలో అయితే కొన్ని ప్రైవేట్ పాఠశాలల అరాచకాలు రోజు రోజుకు శృతి మించిపోతున్నాయి. తాజాగా శామీర్ పేట్ మండలం బాబాగూడ లోని శాంతినికేతన్ పాఠశాల లోని విద్యార్ధులు యాజమాన్యం పెట్టే చిత్రహింసలకు బలి అయిపోతున్నారు. పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న వార్డెన్ రాకేష్ చదువు పేరుతో తమను వేధిస్తున్నారంటూ విద్యార్ధులు వాపోతున్నారు. తాము చదవక పోతే ఇంజక్షన్ ఇస్తా మరియు కొడతా అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పాఠశాలలో తమకు సరైన భోజనం కూడ పెట్టడం లేదని, కొన్ని సార్లు అయితే ఆహారంలో పురుగులు సైతం వస్తున్నాయంటూ పేర్కొన్నారు.

దీనిపై ఫిర్యాదు కూడ చేశామని, అయినా ఎవరు కూడా పట్టించుకోవడం లేదని, వాపోయారు. కాగా దిల్ సుఖ్ నగర్ కు చెందిన లిరి, ఘట్ కేసర్ కు చెందిన హేమంత్ లు పాఠశాల వార్డెన్ వేధింపులు భరించలేక స్కూల్ ప్రహరీ గోడ దూకి అక్కడి నుంచి పారిపోయి ఇంటికి వచ్చారు. దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఈ పాఠశాలపై అనేక ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయని, అయినా అధికారులు స్పందించడం లేదని పలువురు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


