దశాబ్దివేడుకలకు భారీ ఏర్పాట్లు
తెలంగాణ అధికారిక చిహ్నంలోనూ కీలక మార్పులు... చిత్రకారుడు రుద్ర రాజేశంతో రేవంత్ చర్చలు
హైదరాబాద్ రాయదుర్గంలోని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్టూడియోను ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా జయ జయహే తెలంగాణ గేయంపై కవి అందెశ్రీ, సంగీత దర్శకులు కీరవాణితో రేవంత్ రెడ్డి చర్చించారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర గేయం రికార్డింగ్ పూర్తయిందని తెలుసుకుని హర్షం వ్యక్తం చేశారు.
జయభేరి, హైదరాబాద్, మే 27:
తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ అన్నీ రాచరిక పోకడలతో పాలన చేసిందని రేవంత్ రెడ్డి విమర్శిస్తూ ఉంటారు. కాకతీయ కళాతోరణాన్ని కూడా ఆయన రాచరిక పోకడగానే చెబుతారు. ప్రస్తుతం తెలంగణ చిహ్నంలో ఉన్న ఆ తోరణాన్ని తొలగించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని గమనించి బీఆర్ఎస్ పార్టీ నేతలు.. కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ చిహ్నంలోనుంచి తీసేసే ప్రయత్నం చేస్తున్నారని... వరంగల్ యువత తిరగబడాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఏర్పడక ముందు నుంచి ఈ గేయం ప్రజాదరణ పొందింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కోట్లాది మంది ఉద్యమకారుల్లో ఈ గేయం స్ఫూర్తి నింపింది. తెలంగాణలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యక్రమాలలో తెలంగాణ గీతంగా, ప్రార్థనా గీతంగా ఈ గేయాన్ని ఇప్పటికే ఆలపిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఆ గేయానికి రాష్ట్ర గేయంగా అధికారిక హోదా కల్పించారు. ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చాల్సిన బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి అప్పగించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డితో కీరవాణి భేటీ అయ్యారు. తెలంగాణ ఖ్యాతిని చాటిన ‘జయ జయహే తెలంగాణ’ పాటకు స్వరాలు చేకూర్చాలని కోరారు. అనంతరం కీరవాణి, అందెశ్రీలకు జ్ఞాపికలను అందించి సత్కరించారు. త్వరలో ‘జయ జయహే తెలంగాణ’ గేయం సరికొత్తగా రూపుదిద్దుకోనుందని తెలంగాణ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ కళాకారులను అవమానించడమే
‘జయ జయహే తెలంగాణ’ గేయానికి సంగీతాన్ని అందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం కీరవాణికి అప్పగించడంపై తెలంగాణ సినీ మ్యూజీషియన్స్ అసోసియేషన్(టీసీఎంఏ) విమర్శించింది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ‘జయ జయహే తెలంగాణ’ గేయానికి సంగీతం అందించే బాధ్యత పొరుగు రాష్ట్రానికి చెందిన కీరవాణికి ఇవ్వడం చారిత్రక తప్పిదం అవుతుందని టీసీఎంఏ నేతలు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. అందెశ్రీ రచించిన ‘జయజయహే తెలంగాణ’ గేయాన్ని తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రకటించి విడుదల చేయడంపై తెలంగాణ ప్రజలు, కళాకారులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని టీసీఎంఏ నాయకులు అన్నారు.
తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన ఇంతటి గొప్ప గేయాన్ని పాడించే అవకాశం, సంగీతాన్ని అందించే బాధ్యతను తెలంగాణ కళాకారులకు కాకుండా పొరుగు రాష్ట్రం వారికి అప్పగించడం సరైన నిర్ణయం కాదని లేఖలో పేర్కొన్నారు. సీఎం రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ కళాకారులను అవమానించడమే అవుతుందని అన్నారు. రాష్ట్రంలో ఎంతో ప్రతిభావంతులైన కళాకారులు ఉన్నారని, ఈ అవకాశాన్ని తెలంగాణ వాసులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చిహ్నం మార్పు
తెలంగాణ రాష్ట్ర పదో అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని కూడా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. తెలంగాణ తల్లి, రాష్ట్ర చిహ్నాన్ని మార్చాలని రాష్ట్ర కేబినెట్లో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవం ప్రతిబించించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకువస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. త్తందార్లపై తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ, రజాకార్లపై తుపాకీ ఎక్కుపెట్టిన మల్లు స్వరాజ్యం వంటి వారి ఉద్యమస్ఫూర్తి కనిపించేలా విగ్రహం రూపుదిద్దుకుంటున్నట్లు పేర్కొన్నాయి. తెలంగాణ చిహ్నంలోనూ ఉద్యమ స్ఫూర్తి, అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా మార్పులు చేస్తున్నారు.
గతంలో రేవంత్ రెడ్డి రాచరిక పోకడల్ని తీసేస్తామని ప్రకటించారు. తెలంగాణ చిహ్నంపై తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. పలు నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేసి కొత్త చిహ్నం రెడీ చేయిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఫైనల్ చేసి రెండో తేదీన అవతరణ దినోత్సవం రోజున ప్రకటించే అవకాశం ఉంది. ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ సాధనలో పనిచేసిన వాళ్లను ఘనంగా సన్మానించాలని భావిస్తున్నారు.
తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది తామేనని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవాలు కావడంతో అత్యంత భారీగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ పాటను తెలంగాణ గీతంగా ప్రకటించారు. ఇప్పుడు దానికి ట్యూన్ కంపోజ్ చేయిస్తున్నారు. రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ చేతుల మీదుగా జూన్ 2న రాష్ట్ర గీతాన్ని రిలీజ్ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోనియా గాంధీ చేతుల మీదుగా వీటిని విడుదల చేయనున్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవం ప్రతిబిబించేలా.. చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం ఉంటాయని చెబుతున్నారు.
Post Comment