మారనున్న హైదరాబాద్ .. మెగా హైదరాబాద్
జయభేరి, హైదరాబాద్, మే 29 :
భాగ్యనగరానికి మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్డు వరకూ జీహెచ్ఎంసీని విస్తరించేందుకు రేవంత్ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను అన్నీ కలిపి అందులో భాగంగా మెగా గ్రేటర్ కార్పొరేషన్ ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే జీహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్, హెచ్ఎండీఏ మరో మాస్టర్ ప్లాన్, సైబరాబాద్ డెవలప్ మెంట్ అథారిటీ , హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ డెవలప్ మెంట్ అథారిటీ వంటి ప్రణాళికలు ఇప్పటిదాకా అమలవుతున్నాయి. ఇప్పుడు వీటన్నింటి స్థానంలో సమగ్ర ప్రణాళిక తీసుకు వచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఒకసారి మాస్టర్ ప్లాన్ కనుక ఫైనల్ అయితే అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. పర్యాటక రంగానికి, రియాలిటీ రంగానికి దీనితో ఆదాయ వనరుగా మారుతుంది. రాబోయే 30-40 సంవత్సరాల అవసరాలు తీర్చడంతో పాటు దేశ, విదేశీ నగరాలను మించి మహానగరాలకు ధీటుగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది.
ఇప్పటికే దీనికోసం అన్ని విభాగాలను సమాయత్తం చేసింది. 2050 మాస్టర్ ప్లాన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇండస్ట్రీ వర్గాలు హర్షిస్తున్నాయి. ఐటీ పరిశ్రమలకు, పరిశ్రమలకు, ఫార్మా సిటీకి, గ్రీన్ జోన్కు, రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాలకు ప్రభుత్వం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రియాల్టీ మార్కెట్ మరింత పెరిగే అవకాశముంది. రియాల్టీ మార్కెట్ పెరగడంతో పాటు వృద్ధికి ఆస్కారమున్న ప్రాంతాల్లో కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కూడా పెరిగే చాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సిటీకి సమగ్ర మాస్టర్ ప్లాన్ అమల్లోకి వస్తే రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు, రింగ్ రోడ్డు నుంచి సిటీకి ప్రత్యేక కనెక్టివిటి పెరుగుతుంది. మెట్రో రైల్ కనెక్ట్ విషయంలో కూడా క్లారిటీ రావడమే కాకుండా ప్రాజెక్టుకు అడుగులు పడుతాయి. వీటితో పాటు విద్యుత్, తాగునీరు వంటి మౌలిక విషయాలలో ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ప్రకారం డెవలప్ చేయాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ విషయానికి వస్తే 2007లో 12 మున్సిపాలిటీలు, 8 గ్రామ పంచాయితీలను కలిపి జీహెచ్ఎంసీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సుమారు 1కోటి జనాభ ఉన్న కారణంగా.. 150 డివిజన్లను ఏర్పాటు చేశారు.
ఇప్పటివరకు హైదరాబాద్ మహానగరం అభివృద్ధి చెందుతున్నా కానీ.. హైదరాబాద్ చుట్టూ ఉన్న.. 21 పురపాలక సంఘాలలో మాత్రం ఎలాంటి అభివృద్ధి లేకపోవడంతో.. ఇప్పుడు వాటిని కూడా డెవలప్ చేసి .. మెగా గ్రేటర్ హైదరాబాద్ గా రూపుదిద్దాలనే .. ఒక మాస్టర్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు అధికారులు..ప్రస్తుతం బల్దియా పరిధిలో 150 డివిజన్లు ఉన్నాయి. దాదాపు 74 లక్షలమంది ఓటర్లు ఉన్నారు. జనాభా కోటి వరకు ఉంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను బల్దియాలో విలీనం చేస్తే జనాభా మరో 60 లక్షల వరకు పెరుగుతుంది. అదనంగా మరో 50 నుంచి 60 డివిజన్ల వరకు పెరుగుతాయని అధికారుల అంచనా.
అప్పుడు 210 వరకూ డివిజన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మెగా గ్రేటర్ కు పెద్దగా ఉంటుందని భావించిన సీఎం రేవంత్ రెడ్డి దీనిని రెండు విభాగాలు గా చేయమని అధికారులను ఆదేశించారు. దీనిపై ప్రస్తుతం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 7 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలు మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలోనే గ్రేటర్పై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారనే చర్చ జరుగుతోంది. రాజధాని పరిధిలో ప్రస్తుతం 5 మాస్టర్ ప్లాన్లు ఉండటంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ఐదింటిని విలీనం చేసి.. వచ్చే 30 ఏళ్లు అమలులో ఉండే విధంగా ఒకే మాస్టర్ప్లాన్ను రూపొందించాలని సీఎం ఆదేశించారు. దీనికి అనుగుణంగానే అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో గ్రేటర్ను కూడా విస్తరించాలని సీఎం భావించారు. ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న సంస్థలన్నింటికీ కలిపి మెగా గ్రేటర్ను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. 3 నెలల్లో దీనిపై ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించడంతో అధికారులు ప్రస్తుతం ఆ పనిలో ఉన్నారు.
Post Comment